The PSLV-C41 carrying indigenous navigationsatellite IRNSS-1I blasted off from first launch pad at 0404 hrs fromthe spaceport of Sriharikota
ఇస్రో చరిత్రలో ఇది మరో మైలురాయి. దేశీయ నేవిగేషన్ వ్యవస్థ కోసం రూపొందించిన పీఎస్ఎల్వీ-సి41 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
గురువారం తెల్లవారుజామున 4.04 గంటలకు పీఎస్ఎల్వీ-సి41ని లాంచ్ చేశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. నింగిలోకి ఎగిరిన సరిగ్గా 19నిమిషాల 19.6సెకన్ల తర్వాత అది కక్షలోకి ప్రవేశించింది.
మొత్తం నాలుగు దశలను దాటుకుంటూ వెళ్లిన రాకెట్.. ఆ తర్వాత ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహం నిర్ణయించిన సమయానికి విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది. 1425కిలోల బరువున్న ఈ ఉపగ్రహం ద్వారా మన దేశానికి సొంత నేవిగేషన్ వ్యవస్థను రూపొందించుకునే అవకాశం ఏర్పడుతుంది.
నేవిగేషన్ వ్యవస్థ కోసం మనం ఇంత వరకు అగ్రరాజ్యాల మీద ఆధారపడుతూ వచ్చాం. జిపిఎస్ సిస్టం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నాం. జిపిఎస్ను సొంతంగానే రూపొందించుకోవాలనే లక్ష్యంతో ఇస్రో ఈ ఉపగ్రహాలను రూపొందించింది. అమెరికన్ జీపీఎస్ తరహాలో పనిచేసే ఈ వ్యవస్థకు 'నావిక్' అని పేరు పెట్టారు. ఈ ఉపగ్రహం ద్వారా భారత్ చుట్టూ 1500కి.మీ మేర నేవిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహం ప్రధానంగా రెండు రకాల సేవలను అందిస్తుంది. ప్రామాణిక స్థితి సేవలు(స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్), నియంత్రిత సేవలు(రిస్ట్రిక్టెడ్ సర్వీస్)లను దీని ద్వారా పొందవచ్చు. ప్రామాణిక స్థితి సేవలు అమెరికా జీపీఎస్ కు సమాన స్థాయిలో ఉంటాయి. ఇవి యూజర్స్ అందరికీ అందుబాటులో ఉంటాయి. కానీ నియంత్రిత సేవలు మాత్రం అథారైజేషన్ కలిగినవారికే మాత్రమే అందుబాటులో ఉంటాయి.