Kharif Grain Collection in Telangana : రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా కల్పించారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్, ఇంఛార్జ్ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులతో సీఎం విడివిడిగా టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న వారం, పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని తెలిపారు. ఈ కీలకమైన సమయంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం అమ్ముకోవాల్సిన అవసరం లేదని సీఎం సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అటు మిల్లర్లు కానీ, ఇటు వ్యాపారులు కానీ ఇబ్బంది పెడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. అలా చేసిన వారిపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. ధాన్యం సేకరణపై రోజువారీగా సమీక్షలు నిర్వహించాలని జిల్లాల ఇంఛార్జ్ మంత్రులను ఆదేశించారు.