Mahila Margadarsi Award : మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శైలజా కిరణ్కు మహిళా మార్గదర్శి పురస్కారం వరించింది. 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జీ తెలుగు అప్సర అవార్డ్స్-2025 కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులకు పురస్కారాలతో సత్కరించింది. పారిశ్రామిక రంగంలో 35 ఏళ్లుగా రాణిస్తున్న మార్గదర్శిని మేటి సంస్థగా నిలబెట్టినందుకు ఎండీ శైలజాకిరణ్ ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మార్గదర్శి 123 బ్రాంచ్లుగా విస్తరించిన మార్గదర్శి సంస్థ ప్రస్థానాన్ని ఏవీ రూపంలో ప్రదర్శించారు.
అనంతరం మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ మాట్లాడుతూ, జీ అప్సర అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో దివంగత ఛైర్మన్ రామోజీరావు దీవెనలు, సంస్థ ఉద్యోగుల కఠోర శ్రమ, కుటుంబ సహకారం దాగి ఉన్నాయని చెప్పారు. రామోజీరావు పనిపట్ల స్వేచ్ఛను ఇవ్వడం వల్లే సమర్థ నాయకత్వం సాధ్యమైందన్నారు. రామోజీరావు తనపై ఎంతో నమ్మకంతో మార్గదర్శి సంస్థ బాధ్యతలు అప్పగించారన్నారు. అవార్డులు, రివార్డులు మనపై ఉన్న బాధ్యతను మరింతగా గుర్తుచేస్తాయని చెప్పారు. ఇలా ఇంతమంది ప్రముఖ సినీతారల సమక్షంలో పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.