Miss World contestants visit Ramoji Film City : కనువిందు చేసే కమనీయ కట్టడాలు, ఆకర్షించే ఆకృతులు, ప్రకృతి రమణీయతకు నెలవైన రామోజీ ఫిల్మ్సిటీలో అందాల భామలు సందడి చేశారు. ఫిల్మ్సిటీకి చేరుకున్న 108 మంది దేశ, విదేశాలకు చెందిన మిస్వరల్డ్ పోటీదారులకు అధికారులు, రామోజీ ఫిల్మ్సిటీ ప్రతినిధులు ఎర్రతివాచిపై స్వాగతం పలికారు. తెలుగువారి సంప్రదాయపద్ధతిలో గంధం పూసి, పన్నీరు చల్లి చిత్రపురిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నేత మల్రెడ్డి రాంరెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్కుమార్, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ సీఈఓ బాపినీడు విదేశీ అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీ సైనేజ్ వద్ద గ్రూప్ ఫోటోషూట్తో సుందరీమణులు సందడి చేశారు. అనంతరం పర్యాటక నగరిలో ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు.
రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్న ముద్దుగుమ్మలు పర్యాటకనగరి అందాలు చూసి ముగ్ధులయ్యారు. తార, సితార హోటళ్లు, ఏంజెల్ ఫౌంటెన్, హవా మహల్, నర్తకి గార్డెన్, పామ్ స్ట్రీట్ అందాలను వీక్షిస్తూ పీఎస్టీ కన్వెన్షన్ హాల్కు చేరుకున్నారు. PST కన్వెన్షన్ హాల్ వద్ద బ్యాండ్తో ముద్దుగుమ్మలకు స్వాగతం పలికారు. ఫిల్మ్ సిటీ ప్రతినిథులు వారి కోసం తేనీటి విందు ఏర్పాటు చేశారు.